: మళ్లీ జైలుకి వెళ్లిపోయిన మిథున్ రెడ్డి

  • ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి
  • గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం చేరుకున్న మిథున్ రెడ్డి
  • మార్గాని ఎస్టేట్స్ లోని వైసీపీ నగర కార్యాలయం వద్ద మిథున్ రెడ్డికి స్వాగతం పలికిన మాజీ ఎంపీ భరత్‌ రామ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోకి వెళ్లిపోయారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన మిథున్ రెడ్డి .. కోర్టు ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం తిరిగి రాజమహేంద్రవరం జైలుకు చేరుకున్నారు. 
 
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 6న విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటల లోపు తిరిగి జైలుకు హాజరుకావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తిరిగి జైలుకు చేరుకున్నారు.  
 
గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం

మిథున్‌రెడ్డి తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. అనంతరం మార్గాని ఎస్టేట్స్‌లోని వైసీపీ నగర కార్యాలయానికి వెళ్లగా, అక్కడ ఆయనకు మాజీ ఎంపీ భరత్‌రామ్ స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు.
 
పుట్టినరోజు వేడుకల రద్దు

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సమీపంలోని ఓ హోటల్‌లో మిథున్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేసినప్పటికీ, సమయం లేకపోవడంతో వేడుకలను చివరి నిమిషంలో రద్దు చేశారు. ఆ హోటల్ వద్దకు మిథున్ రెడ్డి చేరుకుని కార్యకర్తలు, అభిమానులను కలిసి జైలుకు వెళ్లిపోయారు.

More Telugu News