Renu Agarwal: కూకట్‌పల్లి మహిళ హత్య కేసు: వాళ్లిద్దరే హంతకులు!

Renu Agarwal Murder Case Shocking Details Emerge in Kukatpally
  • ఇంట్లో పనిచేసే హర్ష, రోషన్‌ల పనేనని నిర్ధారించిన పోలీసులు
  • బంగారం, నగదు దోపిడీ చేసేందుకే ఘాతుకం
  • చిత్రహింసలు పెట్టి, కుక్కర్‌తో కొట్టి, గొంతుకోసి హత్య
  • యజమాని స్కూటీపై పారిపోయిన నిందితులు
  • నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
కూకట్‌పల్లి మహిళ హత్య కేసులో దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగారంపై కన్నేసిన పనివాళ్లే యజమానురాలిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారు.  రేణు అగర్వాల్ (50) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఆమె ఇంట్లో కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్న హర్ష, అదే భవనంలోని బంధువుల ఇంట్లో పనిచేస్తున్న రోషన్ అనే ఇద్దరు యువకులు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ముందుగా ఆమెను కాళ్లు, చేతులు కట్టేసి, లాకర్ తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని చిత్రహింసలకు గురిచేశారు. ఆమె ఎంతకీ చెప్పకపోవడంతో, ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా మోది, చివరకు గొంతుకోసి ప్రాణాలు తీశారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యజమాని స్టీల్ వ్యాపారి కావడంతో ఇంట్లో బంగారం, నగదు భారీగా ఉంటుందని భావించి దోపిడీకి పథకం పన్నారు. ఝార్ఖండ్‌లోని ఒకే ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు స్నేహితులు పక్కా ప్లాన్‌తో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాధితురాలు అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు సహాయంగా ఉండేందుకు కేవలం 11 రోజుల క్రితమే హర్షను పనిలో పెట్టుకున్నారు.

రేణును హత్య చేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసుతో పాటు కొంత నగదు కూడా తీసుకుని నిందితులు పరారయ్యారు. యజమాని స్కూటీపైనే హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడ వాహనాన్ని వదిలేసి రైలులో తప్పించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు కోల్‌కతాకు చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పనిలో చేరినట్టు తెలుసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించారు. అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Renu Agarwal
Kukatpally murder case
Hyderabad crime
gold robbery
domestic help
crime news
murder for gain
Jharkhand
Hafizpet Railway Station
pressure cooker murder

More Telugu News