Supreme Court of India: పొరుగు దేశాల్లో సంక్షోభం.. మన రాజ్యాంగంపై గర్వంగా ఉంది: సుప్రీంకోర్టు

పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లలో నెలకొన్న రాజకీయ సంక్షోభాలను ప్రస్తావిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మన రాజ్యాంగం కల్పించిన స్థిరత్వం పట్ల గర్వంగా ఉందని అభిప్రాయపడింది. రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి విధించే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన అభిప్రాయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, "మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్‌లో పరిస్థితి గమనించండి" అని వ్యాఖ్యానించారు. దీనికి ధర్మాసనంలోని జస్టిస్ విక్రమ్‌నాథ్ వెంటనే స్పందిస్తూ, "అవును.. బంగ్లాదేశ్‌లోనూ" అని జతచేశారు. ప్రజా ప్రాముఖ్యం ఉన్న ఏ చట్టంపైనైనా సుప్రీంకోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందని సీజేఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇదే విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. గవర్నర్లు బిల్లులను నెలల తరబడి తమ వద్ద అట్టిపెట్టుకునే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయని ధర్మాసనానికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లుల్లో 90 శాతం వాటికి గవర్నర్లు నెలలోపే ఆమోదం తెలుపుతున్నారని ఆయన వివరించారు. 1970 నుంచి 2025 వరకు కేవలం 20 బిల్లులు మాత్రమే రిజర్వ్‌లో ఉన్నాయని, వాటిలో తమిళనాడుకు చెందినవి ఏడు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
Supreme Court of India
Indian Constitution
Nepal crisis
Bangladesh crisis
Justice Gavai
President Murmu
Governor bills
Solicitor General Tushar Mehta

More Telugu News