DK Shivakumar: చిచ్చు పెట్టడం కాదు.. ఢిల్లీ వెళ్లి నిధులు తేండి: బీజేపీకి డీకే శివకుమార్ సవాల్

DK Shivakumar Challenges BJP to Bring Funds from Delhi
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ప్రజలను విడదీసి, మత విద్వేషాలతో చిచ్చు పెట్టడమే బీజేపీ నేతల పని అని, వారికి రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా విమర్శించారు. దమ్ముంటే ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అనుమతులు తీసుకురావాలని ఆయన సవాల్ విసిరారు. శివకుమార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఆర్. అశోక అంతే ఘాటుగా బదులిచ్చారు.

మీడియాతో మాట్లాడిన శివకుమార్, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. "బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం తప్ప ఇంకేం చేస్తారు? మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం వారికి అలవాటుగా మారింది. వారికి నిజంగా రాష్ట్రంపై ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, ఉపాధి హామీ నిధులు తీసుకురావాలి. మేకెదాటు, మహదాయి సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించాలి" అని సవాల్ విసిరారు.

మద్దూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన రాళ్ల దాడి ఘటన గురించి విలేకరులు ప్రశ్నించగా, తాను రాష్ట్రం బయట ఉన్నందున పూర్తి వివరాలు తెలియవని, సమాచారం లేకుండా స్పందించనని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. 2010 నుంచి విచారణలో ఉన్న కేసులో ఇప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

డీకే వ్యాఖ్యలకు అశోక కౌంటర్

డీకే శివకుమార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఆర్. అశోక తీవ్రంగా స్పందించారు. "అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ నేతలకు ఐదేళ్లు ఏ పనీ లేదు. ఇప్పుడు కర్ణాటకలో వాళ్లు అధికారంలో ఉండేది మరో రెండేళ్లే. వాళ్లు ఎన్ని ప్రకటనలైనా చేసుకోనివ్వండి. రెండేళ్ల తర్వాత బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కాంగ్రెస్ నేతలకు మేమే పని చెబుతాం" అంటూ ఆయన ఘాటుగా బదులిచ్చారు.

ఇదిలా ఉండగా, గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) కింద ఏర్పడిన కొత్త మున్సిపాలిటీలకు మంత్రులను నియమించడంపై డీకే స్పందించారు. మంత్రులు కేవలం తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, మొత్తం జిల్లా బాధ్యతలు చూడాలని, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Go Back to Shorts
DK Shivakumar
Karnataka
BJP
Congress
funds
Delhi
R Ashok
politics
development

More Telugu News