నయనతారకు నోటీసులు పంపిన మద్రాస్ హైకోర్టు

  • నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీతో చిక్కుల్లో నయనతార
  • అనుమతి లేకుండా సినిమా క్లిప్స్ వాడకంపై వివాదం
  • 'చంద్రముఖి', 'నాన్ రౌడీ ధాన్' చిత్రాల నిర్మాతల ఫిర్యాదు
ప్రముఖ సినీ నటి, లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు చెందిన క్లిప్పులను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, ఈ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పులను, ‘నాన్ రౌడీ ధాన్’ చిత్రానికి చెందిన తెర వెనుక ఫుటేజీని తమ అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆయా చిత్రాల నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇది కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు.

దీంతో ‘చంద్రముఖి’ నిర్మాత ఏపీ ఇంటర్నేషనల్, ‘నాన్ రౌడీ ధాన్’ నిర్మాత అయిన నటుడు ధనుష్‌కు చెందిన నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, నయనతారతో పాటు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది.

న్యాయస్థానం ఆదేశాలతో ఈ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై నయనతార, నెట్‌ఫ్లిక్స్‌ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. 


More Telugu News