Nepal: నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. చేతులెత్తేసిన ప్రభుత్వం.. శాంతిభద్రతలు సైన్యం చేతికి

Army takes charge of law and order in Nepal
షార్ట్స్‌లో చూడండి
పొరుగు దేశం నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 'జెన్-జీ' యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. శాంతిభద్రతల బాధ్యతలను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం, బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది.

కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనల పేరుతో కొందరు అరాచక శక్తులు దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల నిప్పుపెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశ ప్రధాన పరిపాలనా కేంద్రమైన సింఘ్ దర్బార్, సుప్రీంకోర్టు భవనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ క్రమంలో పౌర యంత్రాంగం విఫలమవడంతో తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సైన్యం స్పష్టం చేసింది.

"ఆందోళనల ముసుగులో కొందరు వ్యక్తులు, సమూహాలు విధ్వంసం, లూటీలు, దహనాలకు పాల్పడుతున్నారు. ప్రజలపై దాడులు చేసే ప్రమాదం కూడా ఉంది" అని సైన్యం తన ప్రకటనలో వివరించింది. రోడ్లపైకి వచ్చిన సైనిక సిబ్బంది, కర్ఫ్యూ అమలు గురించి ప్రజలకు ప్రకటనలు చేస్తున్నారు. విధ్వంసక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఆంక్షల సమయంలో అంబులెన్సులు, పారిశుద్ధ్య వాహనాలు, ఆరోగ్య కార్యకర్తల వాహనాల వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే హింసాత్మక ఘటనలకు సంబంధించి 27 మందిని అరెస్ట్ చేసినట్లు సైన్యం వెల్లడించింది. మరోవైపు, ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా నేపథ్యంలో దేశ రాజకీయ భవిష్యత్తుపై చర్చించేందుకు ముందుకు రావాలని నిరసనకారుల ప్రతినిధులను సైన్యం కోరినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పరిస్థితిని బట్టి కర్ఫ్యూను పొడిగించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Nepal
Nepal protests
political unrest
curfew
army
Singha Durbar
Supreme Court
KP Sharma Oli
government
violence

More Telugu News