అమెరికాలో పరువు తీస్తున్న భార‌త మ‌హిళ‌లు.. లక్షల సరుకుతో పట్టుబడ్డ వైనం.. వీడియో వైర‌ల్

  • అమెరికా టార్గెట్ స్టోర్లలో షాప్‌లిఫ్టింగ్ చేస్తూ పట్టుబడ్డ భారత మహిళలు
  • "ఇండియాలో దొంగతనాలు చేయొచ్చా?" అని ప్రశ్నించిన ఓ పోలీస్ అధికారి
  • క్షమించమని వేడుకుంటూ, ఏడుస్తూ కనిపించిన మహిళలు
  • ఒక ఘటనలో రూ. 1.1 లక్షల విలువైన సరుకుల చోరీ
  • వైరల్ అవుతున్న పోలీసుల బాడీక్యామ్ వీడియోలు
అమెరికాలోని ప్రముఖ ‘టార్గెట్’ సూపర్ మార్కెట్లలో భారతీయ మహిళలు షాప్‌లిఫ్టింగ్ చేస్తూ పట్టుబడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల బాడీక్యామ్‌లలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సందర్భంలో "భారత్‌లో దొంగతనాలు చేయడానికి అనుమతి ఉందా?" అని ఓ పోలీస్ అధికారి అడిగిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ఇల్లినాయిస్‌లోని ఓ టార్గెట్ స్టోర్‌లో సుమారు రూ. 1.1 లక్షల విలువైన సరుకులతో ఓ భారతీయ మహిళ పట్టుబడింది. ఆమె ఏడు గంటలకు పైగా స్టోర్‌లోనే గడిపి, చివరకు బిల్లు చెల్లించకుండా కార్ట్‌తో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆ సమయంలో ఆమె, "నన్ను క్షమించండి. నేను ఈ దేశానికి చెందినదాన్ని కాదు. ఇక్కడ ఉండను" అని వేడుకుంది. దీనికి స్పందించిన ఓ అధికారి, "అయితే భారత్‌లో దొంగతనాలు చేయొచ్చా? నేనలా అనుకోవడం లేదు" అని ఘాటుగా ప్రశ్నించారు. అనంతరం ఆమెకు బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు.

ఈ ఏడాది జనవరి 15న జరిగిన మరో ఘటనలో, గుజరాతీ మాట్లాడే మరో భారతీయ మహిళ ఇలాగే టార్గెట్ స్టోర్‌లో పట్టుబడింది. పోలీసుల విచారణ సమయంలో ఆమె తీవ్రంగా ఏడుస్తూ, ఉక్కిరిబిక్కిరైంది. దీంతో పోలీసులు ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు. తాను తీసుకున్న వస్తువులను తిరిగి అమ్ముకోవడానికి ఈ పని చేసినట్టు ఆమె అంగీకరించింది. ఆమె ఆ స్టోర్‌కు రోజూ వచ్చే కస్టమర్ అని, కానీ దొంగతనం చేస్తూ పట్టుబడటం ఇదే మొదటిశారని సిబ్బంది తెలిపారు.

ఈ రెండు ఘటనల్లోనూ మహిళలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.





More Telugu News