ప్రైవేటు దవాఖానాలో దారుణం..పేషంట్‌పై మేల్ నర్సు లైంగికదాడి!

  • కరీంనగర్‌లో ఘటన 
  • బాధితురాలి ఫిర్యాదుతో మూడు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • కేసు దర్యాప్తు చేస్తున్నామన్న సీఐ జార్జిరెడ్డి
కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన యువతిపై అక్కడి మేల్ నర్సు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై బాధిత యువతి కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతి తన తల్లితో కలిసి శనివారం రాత్రి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుంది. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడే బెడ్ పై పడుకుంది. తల్లి మాత్రం వెయిటింగ్ హాల్ లో నిద్రించింది.

ఈ సమయంలో ఆసుపత్రిలో మేల్ నర్సుగా పనిచేస్తున్న యువకుడు తెల్లవారుజామున మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, బాధితురాలిపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మత్తు తగ్గిన అనంతరం యువతికి అస్వస్థతగా అనిపించడంతో తల్లికి విషయం తెలిపింది. ఆపై తల్లి ఆసుపత్రి సిబ్బందిని నిలదీసింది. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై స్పందించిన సీఐ జాన్ రెడ్డి మాట్లాడుతూ.. “అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్య పరీక్షల అనంతరం తెలుస్తుంది. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించాం. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నాం” అని తెలిపారు. నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 


More Telugu News