స్మార్ట్‌ఫోన్లతో షార్ట్ ఫిల్మ్‌లకు కొత్త ఊపు: నిమ్మల రామానాయుడు

  • యువతలోని సృజనను షార్ట్ ఫిల్మ్‌లు వెలికి తీస్తున్నాయన్న నిమ్మల
  • లఘు చిత్రాలు సామాజిక బాధ్యతను గుర్తుచేస్తున్నాయని వ్యాఖ్య
  • షార్ట్ ఫిల్మ్‌లు కొత్త టాలెంట్‌కు మంచి అవకాశమన్న మంత్రి
చేతిలో స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్‌లకు విపరీతమైన ఆదరణ పెరిగిందని, అవి నేటి యువతలోని సృజనాత్మకతను వెలికితీయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈరోజు పాలకొల్లులో జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యువత అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వస్తోందన్నారు. కేవలం వినోదం పంచడమే కాకుండా, సమాజంలో బాధ్యతను గుర్తుచేసే ఎన్నో మంచి లఘు చిత్రాలు వస్తున్నాయని ప్రశంసించారు. షార్ట్ ఫిల్మ్‌లు కొత్త దర్శకులు, నటీనటులకు తమ ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఒక మంచి వేదికగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పాలకొల్లు అందించిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ మొదలుకొని ప్రముఖ నటులు అల్లు రామలింగయ్య, గీత రచయిత అనంత శ్రీరామ్, దర్శకుడు రేలంగి నరసింహరావు వంటి ఎందరో గొప్ప కళాకారులు ఈ గడ్డ నుంచే వచ్చారని ఆయన పేర్కొన్నారు. యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని ఆకాంక్షించారు.


More Telugu News