Shilpa Shetty: ముంబైలోని తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్టు ప్రకటించిన శిల్పా శెట్టి

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే వీరిపై రూ.60 కోట్ల భారీ మోసం కేసు నమోదు కాగా, ఆ వివాదం సద్దుమణగక ముందే శిల్పాశెట్టి తన వ్యాపారానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో ఎంతో పేరుగాంచిన తన ‘బాస్టియన్’ రెస్టారెంట్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్‌లో భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. "ముంబైలో ఎంతో ప్రజాదరణ పొందిన మా బాస్టియన్‌ రెస్టారెంట్‌ను గురువారంతో మూసివేస్తున్నాం. ఈ రెస్టారెంట్ మాకు లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను అందించింది. ఎన్నో ఆనందాలకు వేదికగా నిలిచింది. ఇకపై ఈ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నాం" అని శిల్పాశెట్టి పేర్కొన్నారు. చివరిసారిగా గురువారం నాడు ఒక ప్రత్యేక వేడుకను నిర్వహిస్తున్నామని, దీనికి వ్యాపార భాగస్వాములు, సన్నిహితులు హాజరవుతారని ఆమె తెలిపారు. అయితే, త్వరలోనే సరికొత్త అనుభవాలతో మళ్లీ మీ ముందుకు వస్తామని ఆమె తన పోస్ట్‌లో హామీ ఇచ్చారు.

శిల్పాశెట్టి సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘బాస్టియన్’ పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారెంట్ అనతికాలంలోనే సెలబ్రిటీలు, ముంబై వాసులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. ముంబై వ్యాప్తంగా దీనికి మొత్తం ఆరు బ్రాంచ్‌లు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల శిల్పాశెట్టి దంపతులపై ముంబైకి చెందిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడి ఒప్పందం పేరుతో తనను రూ.60 కోట్లకు మోసం చేశారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసు విచారణలో ఉండగానే, ఇప్పుడు శిల్పాశెట్టి తన రెస్టారెంట్ వ్యాపారాన్ని మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. 
Shilpa Shetty
Shilpa Shetty restaurant
Bastian restaurant Mumbai
Raj Kundra
Mumbai restaurants
restaurant closure
business news
Bollywood actress
Deepak Kothari
fraud case

More Telugu News