Kavitha Kalvakuntla: బీఆర్ఎస్‌ను నాశనం చేసింది.. కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకున్న వేళ, సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె రాక పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, "కవిత తన సొంత పార్టీ బీఆర్ఎస్‌ను నాశనం చేశారు. అలాంటి వ్యక్తి రేపు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, ఇక్కడ కూడా అదే పరిస్థితిని సృష్టిస్తారు. ఆమెను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్‌ను కూడా నాశనం చేయడం ఖాయం" అని తీవ్రంగా విమర్శించారు. కవిత వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన స్పష్టం చేశారు.

కవిత సస్పెన్షన్‌పై స్పందించిన శ్రీధర్ బాబు

కవిత సస్పెన్షన్ అంశం బీఆర్ఎస్, వారి కుటుంబ అంతర్గత వ్యవహారమని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ కోసం సీబీఐకి అప్పగించినట్లు తెలిపారు.
Kavitha Kalvakuntla
BRS party
Congress party
Telangana politics
Anirudh Reddy
MLC Kavitha

More Telugu News