తెలంగాణలో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు.. 13 జిల్లాలకు హెచ్చరిక

  • నేడు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు
  • మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల పాటు అంటే నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఈ జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనున్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


More Telugu News