కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

  • కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం
  • ఎన్‌డీఎస్‌ఏ, కాగ్ రిపోర్టులను కూడా పరిగణనలోకి తీసుకున్న సర్కార్
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నివేదికల్లో తీవ్ర ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను, అనేక అవకతవకలను ఎత్తిచూపాయని ఆయన తెలిపారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కొన్ని ఏజెన్సీలను బాధ్యుల్ని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించగా, ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది.

ఆదివారం ఉదయం సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్‌డీఎస్‌ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక‌పై ఆదివారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు సుమారు 9 గంట‌ల పాటు సుదీర్ఘంగా చ‌ర్చ సాగింది. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.


More Telugu News