తాడిపత్రి గణేశ్ శోభాయాత్రలో ఉద్రిక్తత... జేసీ, కాకర్ల వర్గాల మధ్య రాళ్ల దాడి

  • గణేష్ శోభాయాత్ర వేళ బయటపడ్డ విభేదాలు
  • కాకర్ల వర్గీయుల గణేశ్ విగ్రహం నిదానంగా వెళుతుండడంపై జేసీ ఆగ్రహం
  • వేగంగా వెళ్లాలని సూచన 
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేశ్ శోభాయాత్ర సందర్భంగా టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్ అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకోగా, పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టారు.

ఘటన వివరాల ప్రకారం, ఆసుపత్రిపాలెం వద్ద కాకర్ల రంగనాథ్ వర్గీయులకు చెందిన గణేశ విగ్రహం నిదానంగా వెళుతుండగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి వేగంగా వెళ్లాలని సూచించారు. ఈ విషయంపై కాకర్ల రంగనాథ్ ఆగ్రహించి, ప్రభాకర్‌రెడ్డిని దూషించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం రాళ్లదాడిగా మారింది. ఈ ఘర్షణలో కాకర్ల రంగనాథ్‌కు చెందిన ఐషర్ వాహనం, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అనంతరం శోభాయాత్రను తిరిగి కొనసాగించారు. గత ఎన్నికల ముందు కాకర్ల రంగనాథ్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయి.


More Telugu News