మోదీతో జెలెన్‌స్కీ టెలిఫోన్ సంభాషణ... పుతిన్ తో భేటీకి ముందు కీలక విన్నపం

Ukraine president Zelenskyy asks Modi for ceasefire support
షార్ట్స్‌లో చూడండి
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూడాలని, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో రష్యాకు గట్టి సంకేతాలు పంపాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇరువురు నేతలు ఫోన్‌లో సంభాషించారు. నెల రోజుల వ్యవధిలో మోదీ, జెలెన్‌స్కీ మాట్లాడుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఈ సంభాషణ సందర్భంగా, ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర యూరప్ నేతలతో తాను జరిపిన చర్చల వివరాలను జెలెన్‌స్కీ ప్రధానికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ, ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే సరైన మార్గమని భారత్ స్థిరంగా విశ్వసిస్తోందని పునరుద్ఘాటించారు. శాంతిని నెలకొల్పేందుకు చేసే అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై కూడా నేతలు చర్చించుకున్నారు.

ఈ సంభాషణ అనంతరం జెలెన్‌స్కీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మా నగరాలపై నిరంతరం దాడులు జరుగుతున్నప్పుడు శాంతి గురించి అర్థవంతంగా మాట్లాడటం అసాధ్యం. తక్షణమే కాల్పుల విరమణ జరగాలి. ఈ యుద్ధానికి ముగింపు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి" అని ఆయన పేర్కొన్నారు. ఎస్‌సీవో సదస్సులో భారత్ ఈ విషయాన్ని రష్యా, ఇతర దేశాల దృష్టికి తీసుకెళ్లి సరైన సంకేతాలు పంపగలదని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రధాని మోదీని వ్యక్తిగతంగా కలుస్తానని ఆశిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ప్రధాని మోదీ ఎస్‌సీవో సదస్సు కోసం చైనాలోని టియాంజిన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సదస్సు వేదికగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీకి ముందు జెలెన్‌స్కీ ఫోన్ చేసి ఈ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Go Back to Shorts
Volodymyr Zelenskyy
Ukraine
Narendra Modi
SCO Summit
Russia
Putin
India
Peace talks
Ceasefire
Tensions

More Telugu News