జపాన్ ప్రధానికి నరేంద్ర మోదీ స్పెషల్ గిఫ్ట్.. బహుమతికి ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటన శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాకు భారతీయ కళానైపుణ్యానికి, జపాన్ సంస్కృతికి అద్దం పట్టేలా ఒక అపురూపమైన బహుమతిని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విలువైన మూన్‌స్టోన్ (చంద్రకాంత శిల)తో తయారు చేసిన రామెన్ గిన్నెల సెట్‌ను, వెండి చాప్‌స్టిక్‌లను ఆయన బహూకరించారు.

ఈ బహుమతిలో జపాన్ సంప్రదాయ ఆహార పద్ధతులైన దొన్‌బురి, సోబాలను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ సెట్‌లో ఒక పెద్ద బ్రౌన్ మూన్‌స్టోన్ గిన్నె, నాలుగు చిన్న గిన్నెలు, వెండి చాప్‌స్టిక్‌లు ఉన్నాయి. ఈ గిన్నెల తయారీకి వాడిన మూన్‌స్టోన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి సేకరించడం విశేషం. ప్రధాన గిన్నె కింద భాగంలో రాజస్థాన్‌కు చెందిన సంప్రదాయ 'పార్చిన్ కారీ' శైలిలో మక్రానా మార్బుల్‌పై రత్నాలతో అలంకరణ చేశారు.

అలాగే, జపాన్ ప్రధాని భార్యకు మోదీ కశ్మీరీ పశ్మీనా శాలువాను బహూకరించారు. లడఖ్‌లోని చాంగ్‌తాంగి మేక ఉన్నితో కశ్మీరీ చేనేత కళాకారులు తయారు చేసిన ఈ శాలువా ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనితో పాటు పూలు, పక్షుల డిజైన్లతో కూడిన అందమైన పేపియర్-మాచే బాక్స్‌ను కూడా అందించారు. ఈ బహుమతులు కశ్మీర్ వారసత్వానికి, కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తాయి.

Narendra Modi
Japan
Shigeru Ishiba
India Japan relations
Andhra Pradesh
Moonstone
Raman bowls

More Telugu News