UIDAI: మీ పిల్లల ఆధార్ అప్‌డేట్ చేశారా?.. యూఐడీఏఐ కీలక సూచనలు

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాలను తక్షణమే అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. విద్యార్థులు భవిష్యత్తులో నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు, ప్రభుత్వ పథకాలను పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ ప్రక్రియ అత్యంత కీలకమని స్పష్టం చేసింది.

ఈ మేరకు యూఐడీఏఐ చీఫ్ భువనేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. పిల్లలు పెరిగే కొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపల వంటి బయోమెట్రిక్ వివరాలలో మార్పులు వస్తాయని, అందుకే వాటిని కచ్చితమైన సమయాల్లో అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థికి 5 నుంచి 7 ఏళ్ల మధ్య ఒకసారి, ఆ తర్వాత 15 నుంచి 17 ఏళ్ల మధ్య మరోసారి బయోమెట్రిక్స్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని యూఐడీఏఐ సూచించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తారని స్పష్టం చేసింది. తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, పాఠశాలల్లోనే ప్రత్యేక క్యాంపులను నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే విద్యార్థులు కీలకమైన విద్యా, ఉద్యోగావకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని యూఐడీఏఐ హెచ్చరించింది.
UIDAI
Aadhar update
Student Aadhar
Biometric update
NEET
JEE
CUET
School children
Government schemes

More Telugu News