Mohan Bhagwat: 75 ఏళ్ల రిటైర్మెంట్‌ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

రాజకీయాల్లో, సంస్థల్లో 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని తాను వ్యాఖ్యానించినట్లుగా జరుగుతున్న ప్రచారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టతనిచ్చారు. తాను గానీ, మరే ఇతర రాజకీయ నాయకులు గానీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని ఎన్నడూ చెప్పలేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో, గతంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవేనని జరుగుతున్న ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడింది.

గురువారం ఢిల్లీలో జరిగిన "100 వర్ష్ కీ సంఘ్ యాత్ర" కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, "నేను రిటైర్ అవుతానని గానీ, ఇంకెవరైనా రిటైర్ అవ్వాలని గానీ ఎప్పుడూ చెప్పలేదు" అని స్పష్టం చేశారు. గతంలో తాను ఆర్ఎస్ఎస్ మాజీ నేత మోరోపంత్ పింగళికి సంబంధించిన ఒక చమత్కారమైన సంఘటనను ఉదాహరించానని, దానిని చాలామంది తప్పుగా అన్వయించుకున్నారని వివరించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పింగళి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయనకు సంబంధించిన మూడు, నాలుగు సరదా సంఘటనలను పంచుకున్నానని గుర్తుచేశారు.

"మోరోపంత్ చాలా చమత్కారి. ఆయన మాటలతో కుర్చీలోంచి ఎగిరి గంతేసేలా చేసేవారు," అని భగవత్ అన్నారు. పింగళికి 75 ఏళ్లు వచ్చినప్పుడు, మరో సీనియర్ నేత హెచ్.వి. శేషాద్రి ఆయనకు శాలువా కప్పి ఇక బాధ్యతల నుంచి తప్పుకోవాలని సున్నితంగా సూచించిన సంఘటనను తాను సరదాగా చెప్పానని, అంతేకానీ దానిని ఒక నిబంధనగా పరిగణించరాదని ఆయన తెలిపారు.

సంఘ్ కార్య పద్ధతిని వివరిస్తూ, "సంఘ్‌లో మేమంతా స్వయంసేవకులం. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక పని అప్పగిస్తారు. నాకు 80 ఏళ్లు వచ్చినా సరే, శాఖను నడపమంటే నడపాల్సిందే. మాకు ఏది చెప్పారో అది చేస్తాం" అని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను సర్ సంఘ్‌చాలక్‌గా ఏకైక వ్యక్తిని అయినప్పటికీ, తన తర్వాత ఆ బాధ్యతలు చేపట్టేందుకు కనీసం 10 మంది సిద్ధంగా ఉన్నారని భగవత్ పేర్కొన్నారు. "సంఘ్ మమ్మల్ని ఎంతకాలం పనిచేయమంటే అంతకాలం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని ఆయన పునరుద్ఘాటించారు.
Mohan Bhagwat
RSS
Rashtriya Swayamsevak Sangh
Retirement age
Narendra Modi

More Telugu News