ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ .. కౌంటర్ ప్లాన్ సిద్దం చేసుకున్న భారత్

  • భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి
  • జౌళి ఉత్పత్తులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై తక్షణ తీవ్ర ప్రభావం
  • ప్రత్యామ్నాయంగా 40 దేశాల్లో మార్కెట్ విస్తరణకు ప్లాన్ సిద్దం చేసిన భారత్  
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించిన విషయం తెలిసిందే. భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అదనపు సుంకాలతో భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే జౌళి ఉత్పత్తులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై తక్షణమే తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ఎగుమతులు తగ్గనున్నాయి. 

ప్రత్యామ్నాయ వ్యూహం సిద్దం

ఈ టారిఫ్‌లతో తలెత్తే ఎగుమతుల విఘాతం నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 40 దేశాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా ఆయా దేశాల్లో భారత ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నించనున్నారు. 

ప్రచార కార్యక్రమాలు చేపట్టే దేశాలు

యునైటెడ్ కింగ్డమ్ (యూకే), జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, కెనడా, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియా, రష్యా, తదితర 40 దేశాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ దేశాల్లో భారత్ ఉత్పత్తులకు మార్కెట్ ను మరింత విస్తరించేలా ఈ కార్యక్రమాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. 


More Telugu News