MK Stalin: బీహార్‌లో ఆ వ్యాఖ్యలు ప్రస్తావించే ధైర్యం ఉందా? అంటూ స్టాలిన్ కు బీజేపీ సవాల్

బీహార్ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు బీజేపీ గట్టి సవాల్ విసిరింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర'లో పాల్గొనేందుకు బీహార్ వచ్చిన స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఆయన పార్టీ నేతలు గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ తెరపైకి తెచ్చింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లో నిర్వహిస్తున్న యాత్రలో పాల్గొనేందుకు సీఎం స్టాలిన్ నేడు ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. "బీహార్ యాత్రలో పాల్గొంటున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మేమొక సవాల్ విసురుతున్నాం. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మీ కుమారుడు చేసిన వ్యాఖ్యలను అక్కడి ప్రజల ముందు ప్రస్తావించే ధైర్యం మీకుందా? అలాగే, బీహారీలను తక్కువ చేస్తూ మీ బంధువు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల గురించి అక్కడ మాట్లాడగలరా?" అని బీజేపీ రాష్ట్ర నేత నారాయణన్ తిరుపతి సూటిగా ప్రశ్నించారు. ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కూడా ఇదే తరహా సవాల్ చేశారు.

బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కును అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర' చేపట్టారు. 16 రోజుల పాటు సాగే ఈ యాత్ర, రాష్ట్రంలోని 25 జిల్లాల మీదుగా 1,300 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో ఇండియా కూటమి భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు కూడా పాల్గొంటున్నారు.
MK Stalin
Stalin Bihar visit
Tamil Nadu BJP
Sanatana Dharma
Dayanidhi Maran
Rahul Gandhi
Voter Adhikar Yatra
Bihar Elections

More Telugu News