Bhumireddy Ramgopal Reddy: డీఎస్సీ అభ్యర్థులకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కీలక సూచన

MLC Bhumireddy Ramgopal Reddy Key Suggestions for DSC Candidates
షార్ట్స్‌లో చూడండి
డీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెప్పుడు మాటలు విని ఆందోళనకు గురికావద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని, ఈ సమయంలో కొందరు కావాలనే గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

వైసీపీ నేతలు, వారికి సంబంధించిన మీడియా సంస్థలు 'ఎడిట్ ఆప్షన్' పేరుతో అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని భూమిరెడ్డి విమర్శించారు. దరఖాస్తు సమయంలోనే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి పోస్టుల ప్రాధాన్యతలను ఎంచుకునే అవకాశం కల్పించామని, ఈ విషయం నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఆప్షన్లు ఇచ్చేది లేదని, ఈ విషయంలో ఎవరూ అయోమయానికి గురికావద్దని సూచించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారని, ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. మరో 15 రోజుల్లో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి, వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

గత వైసీపీ ప్రభుత్వం 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని భూమిరెడ్డి విమర్శించారు. "అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు" అన్నట్లుగా, వారు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఇప్పుడు ఇస్తుంటే అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. ఈ డీఎస్సీ కోసం ప్రభుత్వం గరిష్ఠ‌ వయోపరిమితిని కూడా సడలించి ఎంతో మందికి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో పాల్గొని, రాష్ట్ర విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
Go Back to Shorts
Bhumireddy Ramgopal Reddy
DSC
AP DSC
Teacher Recruitment
Andhra Pradesh Teachers
Chandrababu Naidu
TDP
YCP
Education Jobs
Government Jobs

More Telugu News