స్వదేశీ ఉద్యమానికి యువతే నాయకత్వం వహించాలి: ప్రధాని మోదీ పిలుపు

  • అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ బాలికల హాస్టల్‌కు వీడియో సందేశం ద్వారా శంకుస్థాపన
  • స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలకు, యువతకు ప్రధాని మోదీ పిలుపు
  • 'ఇక్కడ స్వదేశీ వస్తువులే అమ్ముతాం' అని బోర్డులు పెట్టాలని దుకాణదారులకు సూచన
  • మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్ర‌ధాని మోదీ
  • నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడి
దేశ స్వావలంబనకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడమే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది వందేళ్ల నాటి పాత నినాదం కాదని, దేశ భవిష్యత్తును బలోపేతం చేసే ఆధునిక ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. ఈ నూతన స్వదేశీ ఉద్యమానికి సమాజం, ముఖ్యంగా యువత నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ ఫేజ్-2 కన్యా ఛాత్రాలయ (బాలికల వసతి గృహం) శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివారం ఆయన వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రతి దుకాణదారుడు తమ వద్ద "కేవలం స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే అమ్ముతాం" అనే బోర్డును ప్రదర్శించాలని సూచించారు. కుటుంబాలు కూడా దేశీయంగా తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని కోరారు. మంచి ఉద్దేశంతో పవిత్రమైన లక్ష్యంతో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తే దైవబలం కూడా తోడవుతుందని ఆయన పేర్కొన్నారు.

మహిళా సాధికారత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నొక్కిచెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ హాస్టల్‌లో 3,000 మంది బాలికలకు వసతి కల్పించనున్నామని, ఇది వారిని ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా చేస్తుందని తెలిపారు. వడోదర, సూరత్, రాజ్‌కోట్, మెహసానా వంటి నగరాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బాలికా విద్య కోసం ప్రారంభించిన 'కన్యా శిక్షా రథ యాత్ర' వంటి కార్యక్రమాలు ఇప్పుడు 'బేటీ బచావో, బేటీ పఢావో' రూపంలో దేశవ్యాప్త ఉద్యమంగా మారాయని గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు 'లఖ్‌పతి దీదీలు', 'డ్రోన్ దీదీ', 'బ్యాంక్ సఖి' వంటి పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని మోదీ తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా భారత నైపుణ్య మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. 

సౌరశక్తి, రక్షణ, డ్రోన్ పరిశ్రమలతో పాటు స్టార్టప్‌ల రంగంలో దేశం రికార్డు స్థాయిలో పురోగమిస్తోందని చెప్పారు. ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతోనే ఈ నెలలో రూ.1 లక్ష కోట్లతో 'ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన'ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


More Telugu News