సైబర్ నేరగాళ్ల ఉచ్చుకి చిక్కిన మంత్రి నారాయణ అల్లుడు

  • మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు
  • పునీత్ పేరుతో ఆయన కంపెనీ అకౌంటెంట్‌కు నకిలీ మెసేజ్
  • అత్యవసరంగా రూ. 1.40 కోట్లు కావాలని సందేశం
  • డబ్బు బదిలీ చేశాక మోసపోయినట్లు గుర్తించిన అకౌంటెంట్
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఏపీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా రూ. 1.40 కోట్లు కాజేసిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే, మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పేరుతో ఆయన కంపెనీ అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు ఓ సందేశం పంపారు. అత్యవసరంగా డబ్బు అవసరమని, వెంటనే తాను చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ. 1.40 కోట్లు బదిలీ చేయాలని ఆ మెసేజ్‌లో సూచించారు.

ఆ సందేశం నిజంగా పునీత్ నుంచే వచ్చిందని భావించిన అకౌంటెంట్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు చెప్పిన ఖాతాకు డబ్బును బదిలీ చేశారు. అయితే, కొద్దిసేపటి తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించిన అకౌంటెంట్, వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

అకౌంటెంట్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల జాడను కనిపెట్టారు. ఈ మోసానికి పాల్పడింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్, అరవింద్ అనే ఇద్దరు వ్యక్తులుగా గుర్తించి, వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Puneeth
Minister Narayana
Cyber Crime
Andhra Pradesh
Online Fraud
Uttar Pradesh
Cyber Criminals
Accountant Fraud

More Telugu News