చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

  • చిరు-బాలయ్యతో మల్టీస్టారర్‌కు సిద్ధమన్న దర్శకుడు అనిల్ రావిపూడి
  • ఇద్దరి మ్యానరిజమ్స్‌కు సరిపోయే కథ దొరికితే తప్పక తీస్తానని వెల్లడి
  • బాలయ్యతో నటించడానికి చిరంజీవి సుముఖంగా ఉన్నారని ప్రస్తావన
తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అభిమానులు ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మల్టీస్టారర్ ప్రాజెక్టుపై ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన కథ దొరికితే ఇద్దరు అగ్ర హీరోలతో సినిమా తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవితో తాను తెరకెక్కిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ టైటిల్ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు.

బాలకృష్ణతో కలిసి నటించేందుకు చిరంజీవి ఇదివరకే సుముఖత వ్యక్తం చేశారని అనిల్ రావిపూడి గుర్తుచేశారు. “చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరి మ్యానరిజమ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. ఆ ఇద్దరినీ బ్యాలెన్స్ చేసే పక్కా కథ కుదిరినప్పుడు తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాను” అని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో మెగా-నందమూరి అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

ఇక తాను చిరంజీవితో తీస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ, ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్ స్ఫూర్తితోనే ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వివరించారు. ఈ సినిమాలో చిరంజీవి పాత చిత్రాల్లోని ‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో’, ‘బాక్స్‌ బద్దలైపోద్ది’ వంటి పవర్‌ఫుల్ డైలాగులు ఉంటాయని హింట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న బీమ్స్ మాట్లాడుతూ, పాటలన్నీ పూర్తిగా కొత్తవేనని, గత చిత్రాల నుంచి ఎలాంటి రీమేక్‌లు తీసుకోలేదని స్పష్టం చేశారు. చిరంజీవి ఈ సినిమా కోసం తన లుక్‌ను మార్చుకున్నారని, దానికి తగినట్టుగా కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత తెలిపారు. ఈ చిత్రం మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదని, షెడ్యూల్స్ ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News