ఢిల్లీలో మంత్రి లోకేశ్... ఏపీ రోడ్ల అభివృద్ధిపై గడ్కరీకి కీలక ప్రతిపాదనలు

  • ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి లోకేష్ భేటీ
  • విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి పలు ప్రతిపాదనలు
  • విజయవాడ, విశాఖల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణంపై చర్చ
  • కుప్పం-హోసూరు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుమతులు కోరిన మంత్రి
  • రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక రహదారుల విస్తరణకు వినతి
  • భూసేకరణ వేగవంతం చేస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ
విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు–మచిలీపట్నం నడుమ 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలమంత్రి లోకేశ్ విజ్జప్తి చేశారు. లోకేశ్ నేడు ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడతూ... ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కానూరు–మచిలీపట్నం రోడ్డు విస్తరణ ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధికి కూడా ఉపకరిస్తుందని తెలిపారు.  హైదరాబాద్–అమరావతి మధ్య కనెక్టివిటీలో ఎన్ హెచ్–65 కీలక పాత్ర పోషిస్తుందని, ఇప్పటికే మంజూరైన హైదరాబాద్–గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజిని డీపీఆర్ లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు 

"ఎన్ హెచ్–16 వెంట విశాఖపట్నంలో 20 కి.మీ.లు, విజయవాడలో 14.7 కి.మీ.ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లస్ మెట్రో కారిడార్లను నాగపూర్ మోడల్ లో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఎన్ హెచ్ఏఐ, రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఉమ్మడి భాగస్వామ్యంతో డీపీఆర్ రూపకల్పన, వ్యయాన్ని భరించే అంశంపై చర్చ జరిగింది. ఏపీలో రీజనల్ కనెక్టివిటీ, డెవలప్ మెంట్ కారిడార్ల అభివృద్ధిలో భాగంగా కర్నూలు – ఎమ్మిగనూరు రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, వినుకొండ-గుంటూరు నడుమ ఎన్ హెచ్ 544డి, కాకినాడ పోర్టు–ఎన్ హెచ్ 216 నడుమ దక్షిణ రహదారి, కాణిపాక వినాయక దేవాలయం లింకు రోడ్డు నిర్మాణ పనుల చేపట్టాలి" అని గడ్కరీని కోరారు. 

బెంగుళూరు–చెన్నై (ఎన్ఇ-7) రహదారికి డైరక్టర్ కనెక్టవిటీ కోసం కుప్పం-హోసూరు - బెంగుళూరు నడుమ 56 కి.మీ.ల మేర రూ.3వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని లోకేశ్ కేంద్రమంత్రికి విన్నవించారు.  కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (కాడా) ప్రాంతంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేశ్... గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.  రోడ్డు భద్రతా ప్రమాణాల మెరుగుదల, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, లాజిస్టిక్స్, పాసింజర్ కారిడార్ల ఇంటిగ్రేషన్ ఆవశ్యకతను వివరించారు. కేంద్రప్రభుత్వ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్థిరమైన మోడరన్ కనెక్టివిటీ కోసం గ్రీన్ కారిడార్లు, అధునాతన టోలింగ్, రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచార వ్యవస్థల అభివృద్ధిలో కేంద్రం భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేశ్ విజ్జప్తిచేశారు.


More Telugu News