: 'మహావతార్‌ నరసింహ' సినిమాని వీక్షించిన చాగంటి కోటేశ్వరరావు.. ఏమ‌న్నారంటే..!

  • అంచనాలు లేకుండా విడుదలై సంచ‌నాలు సృష్టిస్తున్న 'మహావతార్ నరసింహ'
  • హోంబలే ఫిల్మ్స్ నిర్మాణం.. అశ్విన్ కుమార్ దర్శకత్వం 
  • తెలుగులో అల్లు అరవింద్ సమర్పణలో విడుదలైన సినిమాకు మంచి స్పందన‌
  • నిన్న‌ థియేటర్‌లో ఈ చిత్రాన్ని వీక్షించిన చాగంటి కోటేశ్వరరావు
  • మన పురాణాలకు చాలా దగ్గరగా ఈ సినిమా ఉందన్న ప్రవచన కర్త
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచ‌నాలు సృష్టిస్తున్న యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. కన్నడలో రూపొందిన‌ ఈ యానిమేటెడ్ చిత్రం, తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లు అరవింద్ సమర్పణలో విడుదలై మంచి స్పందన రాబ‌ట్టుకుంది. 

ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ చిత్రం హౌస్‌ఫుల్ షోలతో కొనసాగుతుండటం విశేషం. కేవ‌లం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 230 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టి, ఇండియాలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ మూవీగా అరుదైన‌ ఘనత సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రానికి వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తోంది.  

తాజాగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాని చూశారు. నిన్న‌ అల్లు అరవింద్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి థియేటర్‌లో ఆయ‌న ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మూవీపై స్పందించారు. 

"మన పురాణాలకు చాలా దగ్గరగా ఈ సినిమా ఉంది. భక్త ప్రహ్లాద సినిమాలా ఇది కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. మనుషులతో కాకుండా బొమ్మలతో తీశారు. కానీ ఆ భక్తి, ఆ భావం, ఆ అనుభూతి మాత్రం నిజంగా ఆధ్యాత్మికంగా అనిపించింది. ఈ సినిమా చూస్తుంటే నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా చివరి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు" అని అన్నారు. 

గీతా ఆర్ట్స్, హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో మూవీపై చాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన‌ రివ్యూ వీడియోను పంచుకున్నాయి. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

More Telugu News