గువ్వల బాలరాజు మార్గంలోనే, బీజేపీలోకి వెళతారని ప్రచారం.. స్పందించిన పైలట్ రోహిత్ రెడ్డి

  • పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం
  • ఖండించిన పైలట్ రోహిత్ రెడ్డి
  • ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి
గువ్వల బాలరాజును తానే బీజేపీలోకి పంపించానని, మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా పంపిస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కొన ఊపిరి వరకు కేసీఆర్ వెంటే ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానల్స్‌లో తాను పార్టీ మారుతానంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.

గువ్వల బాలరాజును తానే పంపించానని, మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా పంపిస్తాననే ప్రచారంలో కూడా నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదివరకు కూడా తనకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ఉన్నత పదవులు ఆశ చూపినప్పటికీ తాను పార్టీ మారలేదని ఆయన అన్నారు. తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌దే అని ఆయన కొనియాడారు.

గతంలో బీజేపీ తరఫున వచ్చిన వారిని బహిరంగంగా ప్రపంచానికి పట్టించానని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లకు సైనికుడిలా పనిచేస్తానని పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని, అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.


More Telugu News