ఆసియాకప్‌లో భారత్‌ను నడిపించే నాయకుడు ఇతడే!

  • 19న ఆసియా కప్ కోసం భారత జట్టు ఎంపిక
  • టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఖరారు
  • జట్టు ఎంపిక సమావేశానికి హాజరుకానున్న సూర్య
  • శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లకు చోటుపై అనుమానాలు
  • టెస్టులపై దృష్టి పెట్టాలని జైస్వాల్‌కు సెలక్టర్ల సూచన
  • సంజూ శాంసన్, అభిషేక్ శర్మలతో కొత్త ఓపెనింగ్ జోడీ
ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టు ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీమిండియాలో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, యువ స్టార్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌లకు జట్టులో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. 19న ముంబైలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా సమాచారం అందింది.

కొత్త ఓపెనింగ్ జోడీని పరీక్షించాలని సెలక్టర్లు భావిస్తుండటమే గిల్ ఎంపికకు అడ్డంకిగా మారినట్టు సమాచారం. సంజూ శాంసన్, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్‌ను కొనసాగించాలని యాజమాన్యం యోచిస్తోంది. దీంతో టాప్ ఆర్డర్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో గిల్‌కు స్థానం కష్టంగా మారిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు, ఇంగ్లండ్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్‌ను ప్రస్తుతానికి టెస్ట్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టమని సెలక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా టీ20 జట్టులోకి పరిగణనలోకి తీసుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు, గాయం నుంచి కోలుకుంటున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్‌లో జట్టుకు నాయకత్వం వహించడం దాదాపు ఖాయమైంది. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న సూర్య ఇప్పటికే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. జట్టు ఎంపిక సమావేశంలో పాల్గొనేందుకు సూర్యకుమార్ ప్రత్యేకంగా ముంబై వెళ్లనున్నాడు.

"ఆసియా కప్ కోసం భారత జట్టును 19న ముంబైలో ఎంపిక చేస్తారు. సమావేశం అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జట్టు వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు" అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో, యువ ఆటగాళ్లపై వేటు వేసి, కొత్త కూర్పుతో బరిలోకి దిగాలని సెలక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం.


More Telugu News