ట్రంప్-పుతిన్ భేటీకి ముందు.. భార‌త్‌కు అమెరికా వార్నింగ్

  • రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా హెచ్చరిక
  • ట్రంప్-పుతిన్ భేటీ విఫలమైతే టారిఫ్‌లు మరింత పెంచే అవకాశమ‌న్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ
  • ఇప్పటికే భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించిన అమెరికా
  • యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వ్యాఖ్యలపై శశి థరూర్ ఘాటు స్పందన
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరపనున్న కీలక సమావేశం విఫలమైతే, భారత్‌పై సుంకాలను (టారిఫ్‌లను) మరింత పెంచుతామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు అలస్కాలో ట్రంప్, పుతిన్ మధ్య జరగనున్న ఈ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

బ్లూమ్‌బర్గ్‌ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ, "రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇప్పటికే భారతీయులపై ద్వితీయ శ్రేణి టారిఫ్‌లు విధించాం. చర్చలు సఫలం కాకపోతే, ఆంక్షలు లేదా సుంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది" అని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లను విధించినట్లు ఆయన గుర్తుచేశారు. ఇందులో 25 శాతం సాధారణ సుంకం కాగా, మరో 25 శాతం జరిమానాగా విధించారు.

ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్, రష్యా నుంచి రాయితీ ధరలకు భారీగా చమురును దిగుమతి చేసుకుంటోంది. 2021లో కేవలం 3 శాతంగా ఉన్న ఈ దిగుమతులు, ప్రస్తుతం 35-40 శాతానికి చేరాయి. ఈ పరిణామం వాషింగ్టన్‌, న్యూఢిల్లీ మధ్య సంబంధాలలో కొంత ఒత్తిడికి కారణమవుతోంది. ఇక‌, అమెరికా చర్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించిన విష‌యం తెలిసిందే.

మరోవైపు, ఈ ఆంక్షల విషయంలో యూరప్ దేశాలు కూడా తమతో కలిసి రావాలని బెస్సెంట్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, బెస్సెంట్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. "అన్యాయానికి తలొగ్గడం కంటే, మొండిగా ఉండటమే మేలు" అని ఆయన వ్యాఖ్యానించారు. 


More Telugu News