Lucknow Barauni Express: రైల్లో ఏసీ పనిచేయట్లేదని చూస్తే... మద్యం సీసాల గుట్టు రట్టు!

Lucknow Barauni Express AC failure reveals liquor smuggling
షార్ట్స్‌లో చూడండి
రైలులో ఏసీ పని చేయకపోతే ప్రయాణికులు ఫిర్యాదు చేయడం సాధారణమే. కానీ, ఆ ఫిర్యాదుతో ఏకంగా ఓ భారీ మద్యం స్మగ్లింగ్ దందా బయటపడితే? లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు ఎదురైన ఓ వింత అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏసీ నుంచి గాలి రావడం లేదని ఫిర్యాదు చేస్తే, టెక్నీషియన్లు దాన్ని తెరిచి చూడగా లోపల వందల కొద్దీ విస్కీ బాటిళ్లు కనిపించడంతో అంతా అవాక్కయ్యారు.

లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ-2 టైర్ కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కోచ్‌లో ఏసీ సరిగా పనిచేయడం లేదని, చల్లగాలి రావడం లేదని కొందరు ప్రయాణికులు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది, కోచ్‌లోని 32, 34 నంబర్ బెర్తుల పైన ఉన్న ఏసీ డక్టును తెరిచి చూడగా అసలు విషయం బయటపడింది. లోపల వార్తాపత్రికల్లో చుట్టిన వందల కొద్దీ విస్కీ బాటిళ్లు గాలి ప్రవాహానికి అడ్డుగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, కోచ్ మొత్తం తనిఖీలు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో వైరల్‌గా మారింది. ఏసీ డక్టులో నుంచి మద్యం బాటిళ్లను తీస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వీడియోపై స్పందించిన రైల్వే సేవా విభాగం, తగిన చర్యల కోసం సంబంధిత అధికారులకు సమాచారం పంపినట్లు తెలిపింది. ఈ ఘటనపై బస్తీ జీఆర్‌పీ పోలీసులు ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 60 కింద కేసు (క్రైమ్ నెం. 34/2025) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బీహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున రైళ్లు, ఇతర వాహనాల ద్వారా అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. స్మగ్లర్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇలా ఏసీ డక్టులను ఎంచుకోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే యార్డులోనే సిబ్బంది ప్రమేయంతో ఈ మద్యం లోడ్ చేసి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. "స్మగ్లింగ్ కోసం ఇంత తెలివి వాడతారా?" అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Go Back to Shorts
Lucknow Barauni Express
Lucknow
Barauni
Indian Railways
liquor smuggling
alcohol ban Bihar
AC malfunction
Excise Act
G R P police
train smuggling

More Telugu News