పులివెందులలో ఓటుకు పది వేలు ఇస్తున్నారు: పేర్ని నాని

  • పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప‌ఎన్నికలు
  • ప్ర‌భుత్వంపై వైసీపీ నేత పేర్ని నాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
  • ఓటుకు పది వేల రూపాయలు ఆశచూపిస్తున్నారన్న మంత్రి 
  • టీడీపీ నేతలు ఓటర్ల ఇంటికి వెళ్లి, ఓట‌ర్ స్లిప్స్ లాక్కుంటున్నార‌ని విమ‌ర్శ‌
  • ఇవ్వ‌క‌పోతే బెదిరిస్తున్నార‌ని మండిపాటు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప‌ఎన్నికల నేప‌థ్యంలో ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోందని, ఓటుకు పది వేల రూపాయలు ఆశచూపిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల ఇంటికి వెళ్తున్న టీడీపీ నేతలు.. ఓటర్‌ స్లిప్‌లు లాక్కుంటున్నారని.. ఇవ్వకపోతే ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. 

పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటర్‌ స్లిప్పులను తీసుకుంటున్నారని తెలిపారు. ఓటుకు పది వేల రూపాయలు ఆశచూపి.. ఓటర్‌ స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారని అన్నారు. వైసీపీ నేత‌లపై దాడులు చేస్తాం, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మండిప‌డ్డారు. 

టీడీపీ అక్రమాల నేపథ్యంలో రేపు ఉదయంలోపు మళ్లీ ఓటరు స్లిప్పులను పంచాలని పేర్ని నాని కోరారు. రేపు ఒక్కరోజైనా ఎన్నికల కమిషన్‌ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ క్ర‌మంలో ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైసీపీ నేత‌లు వినతి పత్రం అందజేశారు.


More Telugu News