మహేశ్ బాబు బర్త్‌డే.. 'ఎస్ఎస్ఎంబీ29'పై రాజమౌళి ఆసక్తికర ప్రకటన

  • మహేశ్ సినిమాపై రాజమౌళి కీలక ప్రకటన
  • ఈ ఏడాది నవంబర్‌లో భారీ అప్‌డేట్‌కు ప్లాన్
  • ఫొటోలతో సినిమా స్థాయిని చెప్పలేమన్న జక్కన్న
  • డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయనున్న మహేశ్ బాబు
  • కీల‌క‌ పాత్రల్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేష‌న్‌లో రానున్న భారీ చిత్రం 'ఎస్ఎస్ఎంబీ29' (వ‌ర్కింగ్ టైటిల్) గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం రాజమౌళి ఒక కీలక ప్రకటన చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. సినిమా స్థాయిని తెలియజేసే ఒక ప్రత్యేకమైన అప్‌డేట్‌ను ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయనున్నట్లు ఆయన ప్ర‌క‌టించారు.

ఈ విషయంపై తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా రాజమౌళి ఒక సందేశాన్ని పంచుకున్నారు. "ఈ సినిమా కథ, దాని పరిధి చాలా విస్తృతమైనవి. కేవలం ఫొటోలు లేదా ప్రెస్ కాన్ఫరెన్స్‌లతో దానికి న్యాయం చేయలేం. అందుకే మేము ఈ సినిమా సారాంశాన్ని, లోతును, మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక ప్రదర్శనను సిద్ధం చేస్తున్నాం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. మీ ఓపికకు ధన్యవాదాలు" అని జ‌క్క‌న్న రాసుకొచ్చారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మహేశ్ బాబు డూప్ సాయం లేకుండా స్వయంగా స్టంట్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, రాజమౌళి తన ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్‌కు బదులుగా ఈ ప్రాజెక్టుకు మరొకరిని ఎంచుకోవడం కూడా చర్చనీయాంశమైంది. 'మగధీర', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌లకు సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.

యాక్షన్ అడ్వెంచర్‌గా, చారిత్రక, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో కొంత భాగం షూటింగ్ పూర్తయింది. మహేశ్ బాబుతో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

SSMB29
Mahesh Babu
Rajamouli
Priyanka Chopra
Prithviraj Sukumaran
Telugu cinema
Indian movies
Action Adventure
Historical movie
Mythological movie

More Telugu News