దేశ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

  • సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పిన ప్ర‌ధాని, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ
  • అన్నాచెల్లెళ్ల ప్రేమకు, నమ్మకానికి ప్రతీక ఈ పండుగ అని వ్యాఖ్య
  • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక అభినందనలు
  • దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న రాఖీ పౌర్ణమి వేడుకలు
దేశవ్యాప్తంగా శనివారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన స్పందిస్తూ, "ఈ ప్రత్యేకమైన రాఖీ పండుగ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు" అని పోస్ట్ చేశారు. 

అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, నమ్మకాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా పలువురు రాజ‌కీయ నేత‌లు కూడా తమ శుభాకాంక్షలను పంచుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, "సోదర సోదరీమణుల మధ్య ఉండే విడదీయరాని ప్రేమ, విశ్వాసం, రక్షణ అనే బంధానికి అంకితమైన పవిత్రమైన పండుగ 'రక్షాబంధన్' సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా 'ఎక్స్' ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. "రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నిబద్ధతకు చిహ్నం. ఈ పవిత్ర పండుగ సందర్భంగా దేశప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ తన శుభాకాంక్షలు తెలిపారు. "ఇది ఆప్యాయతతో కూడిన పవిత్రమైన ముడి, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. సోదర సోదరీమణుల మధ్య ఉన్న విడదీయరాని ప్రేమకు ప్రతీక అయిన ఈ రక్షాబంధన్ పర్వదినాన రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాస పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ, అన్నాచెల్లెళ్ల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.


More Telugu News