కేటీఆర్ హెచ్చరికలకు బండి సంజయ్ కౌంటర్

  • కేటీఆర్ లీగల్ నోటీసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్న బండి సంజయ్
  • చీకటి రహస్యాలు బయటపడతాయంటూ కేటీఆర్‌పై బండి సంచలన ఆరోపణలు
  • ధైర్యం ఉంటే ముఖాముఖి చర్చకు రావాలంటూ కేటిఆర్‌కు సవాల్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌ను ట్విట్టర్ టిల్లుగా సంబోధిస్తూ.. అక్రమాలను మర్చిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. లీగల్ నోటీసుల వెనక దాక్కుంటూ మాట్లాడే నీకు ధైర్యం లేదని, గతంలో కూడా ఇదే ప్రయత్నం చేసి విఫలమయ్యావని సంజయ్ విమర్శించారు.

కేటీఆర్ చిల్లర చేష్టలకు తాను భయపడేది లేదని, ధైర్యం ఉంటే ముఖాముఖి చర్చకు రావాలంటూ సంజయ్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని సంజయ్ అన్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో కేటీఆర్ సొంత చెల్లెలు కూడా భయంతో పారిపోతోందని ఎద్దేవా చేశారు. ఆమె స్వయంగా ఫోన్ ట్యాపింగ్‌ను అంగీకరించిందని సంజయ్ అన్నారు. 

48 గంటలు గడువు అంటున్నావ్ కానీ, నీ సమయం సమీపిస్తోందని, నీ చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయని అన్నారు. దాక్కోవడానికి కూడా కేటీఆర్‌కు ఎక్కడా చోటు ఉండదని సంజయ్ అన్నారు.  

ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో కేటీఆర్, బండి సంజయ్ మధ్య రాజుకుంటున్న రాజకీయ, వ్యక్తిగత విమర్శలు ఎంత దూరం వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. 


More Telugu News