'రుద్రాస్త్ర' రికార్డ్... ఈ గూడ్సు రైలు పొడవు నాలుగున్నర కిలోమీటర్లు!

  • భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం
  • 'రుద్రాస్త్ర' పేరుతో దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు
  • ఏకంగా 4.5 కిలోమీటర్ల పొడవు, 354 వ్యాగన్లు, 7 ఇంజిన్లు
  • విజయవంతంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం
  • రవాణా సామర్థ్యం పెంచేందుకే ఈ మెగా ప్రయోగం
  • ప్రయోగాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
భారతీయ రైల్వే తన చరిత్రలోనే ఓ అద్భుతమైన రికార్డును సృష్టించింది. దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలును విజయవంతంగా నడిపి రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. 'రుద్రాస్త్ర' పేరుతో పిలుస్తున్న ఈ భారీ రైలు ఏకంగా 4.5 కిలోమీటర్ల పొడవుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) పరిధిలోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ డివిజన్ ఈ ఘనతను సాధించింది. గురువారం (ఆగస్టు 7) గంజ్ కవాజా స్టేషన్ నుంచి గర్హ్వా రోడ్ స్టేషన్ వరకు 200 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం ఐదు గంటల్లోనే పూర్తి చేసింది. ఆరు ఖాళీ బాక్సన్ ర్యాక్‌లను అనుసంధానించి ఈ మెగా రైలును సిద్ధం చేశారు. మొత్తం 354 వ్యాగన్లు, 7 ఇంజిన్ల సహాయంతో ఇది గంటకు సగటున 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.

ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రవాణా చేసే సామర్థ్యం పెరుగుతుందని ఈస్ట్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. దీనివల్ల సమయం, మానవ వనరులు ఆదా కావడమే కాకుండా, రైల్వే ట్రాక్‌లపై రద్దీ తగ్గి మరిన్ని రైళ్లను నడిపేందుకు వీలు కలుగుతుందని అధికారులు వివరించారు.

ఈ అద్భుత ప్రయోగానికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. ఈ ఘనత సాధించిన రైల్వే బృందాన్ని ఆయన అభినందించారు. ఈ రికార్డుతో భారత రైల్వే సరకు రవాణా సామర్థ్యంలో మరో మైలురాయిని అధిగమించినట్లయింది.


More Telugu News