మైక్రోసాఫ్ట్‌ను ఓపెన్‌ఏఐ మింగేస్తుంది... సత్య నాదెళ్లకు మస్క్ హెచ్చరిక

  • అందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చిన జీపీటీ-5
  • మైక్రోసాఫ్ట్‌ను ఓపెన్‌ఏఐ మింగేస్తుందంటూ ఎలాన్ మస్క్ వ్యాఖ్య
  • మస్క్ హెచ్చరికకు దీటుగా స్పందించిన సత్య నాదెళ్ల
  • ఇది పీహెచ్‌డీ స్థాయి నిపుణుడి లాంటిదని చెప్పిన ఓపెన్‌ఏఐ సీఈఓ
  • తమ ఉత్పత్తుల్లో జీపీటీ-5ను అనుసంధానించిన మైక్రోసాఫ్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో మరో పెను సంచలనం నమోదైంది. టెక్ దిగ్గజం ఓపెన్‌ఏఐ తన సరికొత్త, అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడల్ 'జీపీటీ-5'ను గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ అత్యాధునిక టెక్నాలజీని వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించడం టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఉద్దేశించి చేసిన ఒక‌ వ్యాఖ్య ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఓపెన్‌ఏఐ ప్రకటన వెలువడిన వెంటనే, ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "ఓపెన్‌ఏఐ... మైక్రోసాఫ్ట్‌ను బతికుండగానే మింగేస్తుంది" అంటూ సత్య నాదెళ్లకు సూటి హెచ్చరిక జారీ చేశారు. ఏఐ రంగంలో ఓపెన్‌ఏఐకి మైక్రోసాఫ్ట్ ప్రధాన భాగస్వామిగా ఉన్న తరుణంలో మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పీహెచ్‌డీ నిపుణుడితో సమానం: ఆల్ట్‌మన్
జీపీటీ-5 విడుదలపై ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ, ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) దిశగా వేసిన అతిపెద్ద ముందడుగు అని అభివర్ణించారు. జీపీటీ-3ని ఒక హైస్కూల్ విద్యార్థితో, జీపీటీ-4ని కాలేజీ విద్యార్థితో పోల్చిన ఆయన, జీపీటీ-5 ఒక పీహెచ్‌డీ స్థాయి నిపుణుడితో సమానమని అన్నారు. దీని సామర్థ్యం చూసి తాను భయపడ్డానని, ఇది ఒకరకంగా ‘మాన్‌హాటన్ ప్రాజెక్ట్’ లాంటి క్షణమని వ్యాఖ్యానించారు. తాను పరిష్కరించలేకపోయిన ఒక క్లిష్టమైన సమస్యను జీపీటీ-5 సునాయాసంగా పరిష్కరించినప్పుడు, తాను పనికిరానివాడినని అనిపించిందని ఆల్ట్‌మన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మస్క్‌కు నాదెళ్ల కౌంటర్
ఎలాన్ మస్క్ హెచ్చరికపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హుందాగా స్పందించారు. "గత 50 ఏళ్లుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఉన్న అసలైన మజా అదే! ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం, భాగస్వామ్యాలు, పోటీ అన్నీ ఉంటాయి. మా అజూర్ ప్లాట్‌ఫామ్‌పై గ్రాక్ 4 కోసం ఎదురుచూస్తున్నాం, గ్రాక్ 5 కోసం కూడా ఆసక్తిగా ఉన్నాం" అని నాదెళ్ల బదులిచ్చారు. మైక్రోసాఫ్ట్ తన 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీ వంటి అన్ని ప్రధాన ఉత్పత్తులలో జీపీటీ-5ను అనుసంధానించినట్లు ఆయన ప్రకటించారు.

మరోవైపు, తన సొంత ఏఐ ప్లాట్‌ఫామ్ 'గ్రాక్'ను వెనకేసుకొచ్చిన మస్క్, ఇప్పటికీ 'గ్రాక్ 4 హెవీ' మోడలే అత్యంత శక్తిమంతమైనదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రముఖ ఏఐ కోడింగ్ ఎడిటర్ 'కర్సర్ ఏఐ' కూడా తమ ప్లాట్‌ఫామ్‌లో జీపీటీ-5ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. తాము పరీక్షించిన వాటిలో ఇదే అత్యంత తెలివైన కోడింగ్ మోడల్ అని తెలిపింది. జీపీటీ-5 ఉచితంగా అందుబాటులోకి రావడంతో ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రరూపం దాల్చింది.


More Telugu News