ప్రియుడితో కలిసి భార్య కుట్ర.. పెళ్లి వేడుకకు వెళ్తుండగా భర్త హత్య

  • ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఘటన
  • వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని పథకం
  • పెళ్లికి వెళ్తుండగా దారికాచి దారుణ హత్య
  • ప్రియుడు, మరో ఇద్దరు అరెస్ట్.. పరారీలో భార్య
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్యచేయించిందో ఇల్లాలు. ఈ కేసులో బాధితుడి భార్య పరారీలో ఉండగా, ఆమె ప్రియుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్  చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. షామ్లీ జిల్లాలో జరిగే తన బావమరిది పెళ్లికి తన భార్య మైఫ్రీన్‌తో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు షహనవాజ్ (28)ను అడ్డగించి దాడిచేశారు. లాఠీలతో కొట్టి, కత్తితో పలుమార్లు పొడిచారు. ఆపై నిందితుల్లో ఒకడు తుపాకితో కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన షహనవాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  

ఈ ఘటనపై షహనవాజ్ భార్య మైఫ్రీన్ కైరానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి కొడుకు కోసం షహనవాజ్ తీసుకెళ్తున్న రూ.1.5 లక్షల కరెన్సీ నోట్లతో చేసిన దండ, అతడి బైక్ కనిపించకపోవడంతో ఇది దోపిడీ కోసం జరిగిన హత్యగా పోలీసులు భావించారు. అయితే, పోలీసులు బైక్‌ను ఆ సమీపంలో గుర్తించడంతో ఇది దోపిడీ కాదని నిర్ధారించారు.

పోలీసుల దర్యాప్తులో షహనవాజ్ భార్య మైఫ్రీన్, ఆమె ప్రియుడు తసవ్వర్ కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్టు తేలింది. తసవ్వర్ షహనవాజ్‌కు దగ్గరి బంధువు కూడా. తన భార్యకు తసవ్వర్‌తో వివాహేతర సంబంధం ఉందని షహనవాజ్‌కు తెలుసు. దీనిని అతడు తీవ్రంగా వ్యతిరేకించడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. అందులో భాగంగానే మరో ముగ్గురితో కలిసి అతడిని హత్య చేయించినట్టు పోలీసులు తెలిపారు. 

ఈ కేసులో తసవ్వర్, మరొక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మిగిలిన నిందితులు, షహనవాజ్ భార్య మైఫ్రీన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మైఫ్రీన్ పరారీలో ఉంది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 


More Telugu News