కాళేశ్వరం ఆలయం వద్ద క్షుద్ర పూజలు

  • భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం వద్ద క్షుద్రపూజల కలకలం
  • జంతువును బలి ఇచ్చినట్టు రక్తం ఆనవాళ్లు
  • భయాందోళనలకు గురవుతున్న స్థానికులు
దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న రోజుల్లో కూడా... గ్రామీణ ప్రాంతాల్లోని కొందరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మూఢనమ్మకాలను వారు వీడటం లేదు. క్షుద్రపూజల పేరుతో అలజడి సృష్టిస్తున్నారు. 

తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండల పరిధిలోని కాళేశ్వరం ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి క్షుద్రపూజలు నిర్వహించారు. ఆలయానికి వెళుతున్న దారితో పాటు, ఆలయం వెనుక భాగంలో శ్రీచక్రం ఆకారంలో ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ చల్లారు. కోడిగుడ్లు, నిమ్మకాయలను ముగ్గులో ఉంచారు. ఆ ప్రదేశంలో అక్కడక్కడ రక్తం ఆనవాళ్లు కూడా ఉండటంతో ఏదో జంతువును బలి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. క్షుద్రపూజలు చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.


More Telugu News