కాంగ్రెస్ ధర్నా బీసీల కోసం కాదు... ముస్లింల కోసం: బండి సంజయ్

  • బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా
  • కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ మాట తప్పిందన్న బండి సంజయ్
  • ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర చేస్తోందని మండిపాటు
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చేస్తున్న ధర్నా బీసీల కోసం కాదని... ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోందని విమర్శించారు. 

కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బండి సంజయ్ అన్నారు. మైనార్టీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ ను అమలు చేయాలనుకుంటోందని విమర్శించారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ కు బీసీలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. 

బీసీలకు రిజర్వేషన్లు 5 శాతం పెంచి, ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని సంజయ్ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే బిల్లుకు తాము మద్దతిస్తామని... లేకపోతే బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా బీసీని ప్రధాని చేసిందా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా? అని అడిగారు. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. బెంగాల్, బీహార్, యూపీ తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు.


More Telugu News