భారత్ లాంటి బలమైన మిత్రుడితో బంధం తెంచుకోవద్దు: నిక్కీ హేలీ
- టారిఫ్ ల పెంపు వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు హేలీ హితవు
- భారత్ కంటే చైనానే రష్యా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తోందన్న హేలీ
- చైనాకు 90 రోజుల మినహాయింపు ఇస్తూ భారత్ పై టారిఫ్ లు విధించడం సరికాదని వ్యాఖ్య
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి పరోక్షంగా సాయపడుతోందంటూ భారత్ పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. చమురు కొనుగోళ్లు ఆపకుంటే భారీ మొత్తంలో టారిఫ్ లు విధిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిక్కి హేలీ స్పందిస్తూ.. భారత్ లాంటి బలమైన మిత్రుడితో విభేదాలు వద్దని ట్రంప్ కు హితవు పలికారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలలో భారత్ కంటే చైనానే ముందు ఉంటుందని గుర్తుచేశారు. అలాంటి చైనాపై విధించిన టారిఫ్ లకు 90 రోజుల విరామం ప్రకటించిన ట్రంప్.. భారత్ పై మాత్రం టారిఫ్ ల మీద టారిఫ్ లు విధిస్తాననడం సరికాదని హేలీ అభిప్రాయపడ్డారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ, చైనా చేయొచ్చా?’ అంటూ హేలీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.