గుర్మీత్ రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్

  • శిష్యులపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ 
  • 2020 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు పెరోల్‌పై బయటకు
  • ఇప్పటి వరకు ఏకంగా 326 రోజులు జైలు బయటే గడిపిన గుర్మీత్ సింగ్
అత్యాచారం, హత్య కేసు దోషి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు మరోమారు పెరోల్ లభించింది. 40 రోజుల పెరోల్ రావడంతో నేడు ఆయన రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఊరేగింపుగా సిర్సా హెడ్‌క్వార్టర్స్‌కు బయలుదేరారు. 2020 తర్వాత గుర్మీత్ సింగ్ తాత్కాలికంగా జైలు నుంచి విడుదల కావడం ఇది 14వ సారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఆయన 21 రోజుల సెలవు (ఫర్లోలు)పై విడుదలయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఇలా ఏకంగా 326 రోజులు జైలు బయట గడిపారు. 

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 2017లో తన శిష్యులిద్దరిపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదనంగా, 2019లో ఒక జర్నలిస్ట్ హత్య కేసు, 2021లో డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకు కుట్ర కేసులో ఆయన దోషిగా తేలారు. 

కాగా, ఆయన పెరోల్‌లు, ఫర్లోలుపై తరచూ విడుదలవుతుండటం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు 20 రోజుల పెరోల్, ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 8 రోజుల ముందు 30 రోజుల పెరోల్‌లో బయటే ఉన్నారు. కాగా, ఈ పెరోల్ సమయంలో గుర్మీత్ రామ్ రహీమ్ సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలో ఉంటారు.   


More Telugu News