సినీ నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

  • కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న మీరా మిథున్
  • 2022లో అరెస్టు వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం
  • మూడేళ్లుగా ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు
  • ఢిల్లీ హోంలో ఉన్నట్టు కోర్టుకు తెలిపిన పోలీసులు
  • అరెస్టు చేసి ఈ నెల 11న హాజరుపర్చాలని ఆదేశించిన కోర్టు
బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి మీరా మిథున్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని తమిళనాడులోని న్యాయస్థానం ఆదేశించింది. దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై నటి మీరా మిథున్‌పై వీసీకే తరపున గతంలో ఫిర్యాదు చేయగా, ఆమె, ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌పై చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

2021 ఆగస్టులో అరెస్టు చేయగా, నెల రోజులకు ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో మీరా మిథున్‌పై 2022లో నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. అరెస్టు వారెంట్ జారీ అయి మూడేళ్లు అవుతున్నా ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతున్న మీరా మిథున్‌ను రక్షించాలని కోరుతూ ఆమె తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కోర్టులో విచారణకు రాగా, పోలీసుల తరపున న్యాయవాది ఢిల్లీ పోలీసులు మీరా మిథున్‌ను రక్షించి అక్కడున్న హోంకి తరలించినట్లు తెలిపారు. ఢిల్లీ హోంలో ఉన్న మీరా మిథున్‌ను అరెస్టు చేసి ఈ నెల 11న హాజరుపరచాలని న్యాయమూర్తి చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. 


More Telugu News