నేను ప్రారంభించిన ఉద్యమానికి ఆయన అండగా నిలిచారు: కేసీఆర్

  • శిబు సోరెన్ మృతి పట్ల కేసీఆర్ విచారం
  • ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు తీరని లోటు అని వ్యాఖ్య
  • 2022లో ఆయన ఆశీస్సులు తీసుకున్నానని వెల్లడి
జేఎంఎం అధినేత, ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ, ఝార్ఖండ్ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి తీరని లోటు అని ఆయన అన్నారు. శిబూ సోరెన్ చేపట్టిన ఝార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి అని చెప్పారు.   

2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపన సమయంలో హైదరాబాద్ లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆయనను ఆహ్వానించుకున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో జేఎంఎం భాగస్వామిగా ఉందని... రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. 

తెలంగాణ ఏర్పాటు అనంతరం 2022లో ఝార్ఖండ్ లో శిబు సోరెన్ ను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నానని కేసీఆర్ తెలిపారు. శిబు సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుమారుడు, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


More Telugu News

KCR K Chandrasekhar Rao Shibu Soren Jharkhand Mukti Morcha JMM Telangana Jharkhand Hemant Soren BRS Party Regional Politics