Raj Kasireddy: ఆ నోట్లపై నా వేలిముద్రలున్నాయా?.. ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితుడు రాజ్ కసిరెడ్డి వాదన

Raj Kasireddy Pleads Innocence in AP Liquor Scam Case
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. తనకు బెయిల్ రాకుండా సిట్ అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

"ఆ డబ్బు నాదే అయితే, ఆ నోట్లపై నా వేలిముద్రలు ఉండాలి కదా? వాటి సీరియల్ నంబర్లను కూడా పరిశీలించండి" అని న్యాయస్థానాన్ని కోరారు. తన వయసు 43 ఏళ్లు అయితే, 45 ఏళ్ల క్రితం నాటి ఆస్తులను కూడా జప్తు చేశారని ఆయన వాపోయారు.

ఈ కేసులో అరెస్టయిన 12 మంది నిందితులను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి తాము నిర్దోషులమని, ఈ స్కామ్‌తో తమకు సంబంధం లేదని కోర్టుకు విన్నవించుకున్నారు. జైల్లో సౌకర్యాల కల్పనపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించడం లేదని మిథున్ రెడ్డి ఫిర్యాదు చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని వివరణ ఇచ్చారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, నిందితులందరికీ ఆగస్టు 13 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో నిందితులను తిరిగి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి జైళ్లకు తరలించారు.

మరోవైపు, ఈ కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. ఆగస్టు 12వ తేదీన సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చార్జిషీట్‌లో మిథున్ రెడ్డి, వరుణ్ పురుషోత్తంతో పాటు మరో ఇద్దరి పేర్లను చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, విదేశాల్లో ఉన్న ఇతర నిందితులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇక సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ మొత్తాన్ని ఏసీబీ కోర్టు పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి, రెండేళ్ల కాలపరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. డబ్బు పెట్టెల ఫొటోలు, వీడియోలను కూడా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Raj Kasireddy
AP Liquor Scam
Andhra Pradesh Liquor Scam
Mithun Reddy
SIT Investigation
ACB Court
Liquor Case
Vijayawada
Varun Purushotham
YSRCP

More Telugu News