Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాక్ కొత్త వ్యూహం... నిఘా వర్గాల సంచలన నివేదిక!

Pakistan New Terrorist Strategy After Operation Sindoor
షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మరోసారి భారీ కుట్రకు తెరలేపింది. భారత బలగాల దాడుల్లో దెబ్బతిన్న ఉగ్రవాద శిబిరాలను తిరిగి నిర్మిస్తోందని, ఇందుకోసం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను వేదికగా చేసుకుందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంచలన నివేదిక వెల్లడించింది. పీవోకేలో దాదాపు 15 కొత్త ఉగ్ర శిబిరాలు, చొరబాట్లకు ఉపయోగించే ల్యాంచ్ ప్యాడ్‌లను నిర్మిస్తున్నట్టు స్పష్టం చేసింది.

గత ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా శిక్షణా కేంద్రం వంటి కీలక స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఈ నష్టం నుంచి తేరుకునేందుకు పాక్ ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్ఐ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నాయని ఐబీ నివేదిక పేర్కొంది.

ఈసారి ఉగ్ర శిబిరాలను పాత ప్రదేశాల్లో కాకుండా పాకిస్థాన్ సైనిక స్థావరాలకు సమీపంలో నిర్మిస్తున్నారు. భారత బలగాలు సులభంగా దాడి చేయలేని ప్రాంతాలను ఎంచుకుంటున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, భారత నిఘా ఏజెన్సీల రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. శిబిరాల్లో ఉగ్రవాదుల సంఖ్యను కూడా పరిమితం చేస్తున్నారు. ప్రతి క్యాంపు లేదా ల్యాంచ్ ప్యాడ్‌లో 20 నుంచి 25 మందికి మించి ఉగ్రవాదులు ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఈ కుట్రలో భాగంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, పాక్ అధికారులు వీటికి పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిసింది. పాకిస్థాన్‌లో కొత్తగా ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్‌ను భారీగా చేపట్టినప్పటికీ, జమ్మూకశ్మీర్‌లో స్థానికులను నియమించుకోవడం మాత్రం వారికి కష్టంగా మారింది. భారత ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండటంతో స్థానిక నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి.

'ఆపరేషన్ సిందూర్' ఇంకా కొనసాగుతోందని, పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవోకేలో పెరుగుతున్న ఉగ్ర కదలికలపై భారత భద్రతా దళాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి.
Go Back to Shorts
Operation Sindoor
Pakistan
Jammu Kashmir
POK
Indian Intelligence Bureau
ISI
Terrorist Camps
Lashkar-e-Taiba
Jaish-e-Mohammed
Hizbul Mujahideen

More Telugu News