అది ఫైనల్ అయినా స‌రే.. బాయ్‌కాట్ చేసే వాళ్లం: ఇండియా ఛాంపియ‌న్స్

  • ఇంగ్లండ్‌ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్ 2025 టోర్నీ
  • ఇవాళ బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన భారత్‌, పాక్‌ సెమీస్‌ మ్యాచ్ ర‌ద్దు
  • మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన ఇండియా ఛాంపియ‌న్స్
  • ఒక‌వేళ టైటిల్ పోరుకు అర్హ‌త సాధించి అక్క‌డా పాక్ ప్ర‌త్య‌ర్థిగా ఉన్నా ఇదే నిర్ణ‌యం తీసుకునేవాళ్ల‌మ‌ని వెల్ల‌డి
ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్‌)లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య గురువారం బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన సెమీస్‌ మ్యాచ్ ర‌ద్దైంది. పహల్గాం ఉగ్రదాడి, రాజ‌కీయ కార‌ణాల‌ నేపథ్యంలో ఇదివరకే లీగ్‌ దశలో దాయాదితో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసిన యువరాజ్‌ సింగ్‌ సేన.. కీలకమైన సెమీస్‌లోనూ అదే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంది. దీంతో టోర్నీ నుంచి భారత్‌ వైదొలగగా.. పాక్‌ నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ క్ర‌మంలో తాము ఒక‌వేళ టైటిల్ పోరుకు అర్హ‌త సాధించి అక్క‌డా పాక్ ప్ర‌త్య‌ర్థిగా వ‌చ్చినా ఇదే నిర్ణ‌యం తీసుకునేవాళ్ల‌మ‌ని ఇండియా ఛాంపియ‌న్స్ ఆట‌గాళ్లు వెల్ల‌డించారు.  

"మేం పాక్‌తో ఆడ‌టం లేదు. మాకు ఎప్పుడైనా స‌రే దేశం ముఖ్యం. దేశం కోసం ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి సంకోచించం. భార‌త జ‌ట్టు స‌భ్యులుగా మేం ఎప్పుడూ గ‌ర్వ‌ప‌డుతూనే ఉంటాం. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మా దేశాన్ని ఎప్ప‌టికీ నిరాశ‌ప‌ర‌చం. మేము సెమీ ఫైన‌ల్‌కు చేరుకున్న త‌ర్వాత మ్యాచ్‌ను ర‌ద్దు చేసుకున్నాం. ఒక‌వేళ ఫైన‌ల్‌కు చేరి అక్క‌డా పాకిస్థాన్ ప్ర‌త్య‌ర్థిగా ఎదురైనా స‌రే ఇదే నిర్ణ‌యం తీసుకునేవాళ్లం. మేమంతా ఒకే మాట‌పై నిల‌బ‌డ‌తాం" అని ఇండియా ఛాంపియ‌న్స్ ప్లేయ‌ర్ ఒక‌రు తెలిపారు. 




More Telugu News