భారత పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ... పాకిస్థాన్ ఏమన్నదంటే..?

  • భారత పార్లమెంట్‌లో ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ఎండగట్టిన అధికార, విపక్షాలు
  • సరైన ఆధారాలు, దర్యాప్తు లేకుండా భారత్‌లోని అధికార, విపక్ష నేతలు మాట్లాడారన్న పాక్ విదేశాంగ శాఖ 
  • ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలకు కట్టుబడి ఉన్నామన్న పాక్   
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి పార్లమెంటులో చర్చ జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని అధికార, విపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు.

దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ, పహల్గాం ఉగ్రదాడి కేసులో సరైన ఆధారాలు, దర్యాప్తు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. ఇరుదేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలకు తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ తెలిపింది.

పహల్గాం ఉగ్ర ఘటనపై ధ్రువీకరించదగిన ఆధారాలు, విశ్వసనీయ దర్యాప్తు లేకుండానే భారత్ ఆరోపణలు చేసిందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. నేతల ప్రకటనలు వాస్తవాలను వక్రీకరించే విధంగా ఉన్నాయని తెలిపింది. 

తమ దేశం అణ్వస్త్ర బెదిరింపులకు పాల్పడిందని చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంది. అంతే కాకుండా సింధూ జలాల ఒప్పందం గురించి తప్పుడు వాదనలు చేశారని తెలిపింది.

ఒక బాధ్యతాయుతమైన దేశంగా శాంతి, ప్రాంతీయ స్థిరత్వం, జమ్ముకశ్మీర్ వివాదం సహా అన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం అర్థవంతమైన చర్చలకు తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ స్పష్టం చేసింది. 


More Telugu News