అనూహ్య రీతిలో బ్రిటన్ గగనతలం మూసివేత

  • నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎన్ఏటీఎస్)లో సాంకేతిక సమస్య
  • బ్రిటన్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు నిలిచిపోయిన వైనం 
  • లండన్ లోని ఆరు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం
నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎన్ఏటీఎస్)లో సాంకేతిక సమస్య కారణంగా బుధవారం సాయంత్రం బ్రిటన్ గగనతలం మొత్తం మూసివేయాల్సి వచ్చింది. ఈ సమస్య వల్ల బ్రిటన్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు నిలిచిపోయాయి దీంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్ఏటీఎస్ ఇంజనీర్లు ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి, లండన్ ప్రాంతంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు తెలిపారు.

ఈ సమస్య వల్ల సంభవించిన అంతరాయాలను తగ్గించేందుకు విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయాలతో కలిసి పనిచేస్తున్నామని ఎన్ఏటీఎస్ తెలిపింది. ఈ అంతరాయం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎన్ఏటీఎస్ క్షమాపణలు తెలియజేసింది. ఈ సంఘటన లండన్‌లోని హీత్రూ, గాట్విక్, స్టాన్‌స్టెడ్, లూటన్, సిటీ, సౌతెండ్ వంటి ఆరు ప్రధాన విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం చూపింది. 

హీత్రూ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఐదవ స్థానంలో, యూరప్‌లో మొదటి స్థానంలో ఉంది. ఈ సాంకేతిక సమస్య కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఆలస్యం లేదా రద్దు అయిన విమానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

గతంలో కూడా ఎన్ఏటీఎస్ సిస్టమ్‌లో సాఫ్ట్‌వేర్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. 2023 ఆగస్టులో జరిగిన ఒక సాంకేతిక లోపం వల్ల విమాన షెడ్యూల్‌లు మాన్యువల్‌గా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది, దీంతో దాదాపు 7,00,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. 

ప్రస్తుత సమస్యను త్వరగా పరిష్కరించినప్పటికీ, పూర్తి సాధారణ స్థితి నెలకొనే వరకు కొంత ఆలస్యం తప్పదని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ విమాన స్థితిని తెలుసుకోవడానికి విమానయాన సంస్థలను, విమానాశ్రయాలను సంప్రదించాలని అలర్ట్ జారీ చేశారు.


More Telugu News