Gautam Gambhir: నువ్వేంటి మాకు చెప్పేది?... ఓవల్ మైదానం క్యూరేటర్ కు గంభీర్ సీరియస్ వార్నింగ్!

Gautam Gambhir seriously warns Oval ground curator
  • భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ నెల 31 నుంచి చివరి టెస్టు 
  • లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా మ్యాచ్
  • ప్రాక్టీస్ కోసం మైదానానికి వచ్చిన టీమిండియా 
  • ఏదో చెప్పేందుకు ప్రయత్నించిన క్యూరేటర్ లీ ఫోర్టిస్
  • ఏం చేయాలో మాకు తెలుసంటూ గంభీర్ రిప్లయ్
లండన్‌లోని ఓవల్‌ స్టేడియంలో టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, పిచ్‌ క్యూరేటర్‌ లీ ఫోర్టిస్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నెల 31 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్టు జరగనుండగా... ప్రాక్టీసు కోసం భారత జట్టు ఓవల్ మైదానం చేరుకుంది. ప్రాక్టీస్ సెషన్‌లో గంభీర్‌ ఆటగాళ్లతో నెట్స్‌లో సాధన చేయిస్తుండగా, పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌ అక్కడికి వచ్చి ఏదో విషయం చెప్పడంతో వాగ్వాదం మొదలైంది.

గంభీర్‌ తీవ్ర స్వరంతో, "నువ్వు ఇక్కడ కేవలం మైదాన సిబ్బంది మాత్రమే. నువ్వు మాకు చెప్పడం ఏంటి? ఏం చేయాలో మాకు తెలుసు. కావాలంటే నీ అధికారులకు చెప్పుకో" అని హెచ్చరించినట్టు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ మాటల యుద్ధం కొంతసేపు కొనసాగింది. ఈ సందర్భంలో భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌ జోక్యం చేసుకొని లీ ఫోర్టిస్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లి విషయాన్ని సద్దుమణిగేలా చేశాడు. అయినప్పటికీ, వారిద్దరి మధ్య వాగ్వాదం కొనసాగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వాగ్వాదానికి కచ్చితమైన కారణం స్పష్టంగా తెలియలేదు, కానీ పిచ్‌ సిద్ధం చేసే విధానం లేదా శిక్షణ సౌకర్యాల గురించి ఏదో వివాదాస్పద అంశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఓవల్‌ స్టేడియం ఇంగ్లండ్‌లోని చారిత్రాత్మక క్రీడా వేదికలలో ఒకటి. ఇక్కడి పిచ్‌లు సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని పేరొందాయి.

ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని టీమ్‌ ఇండియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Gautam Gambhir
India vs England
Oval stadium
Lee Fortis
India coach
Pitch curator
Test series
Cricket
Sitanshu Kotak
Oval pitch

More Telugu News