ఆఖ‌రి టెస్ట్‌కు పంత్ దూరం.. అతని స్థానంలో భార‌త జ‌ట్టులోకి కొత్త ప్లేయ‌ర్‌

  • మాంచెస్టర్ టెస్టులో గాయ‌ప‌డ్డ పంత్ ఐదో టెస్టుకు దూరం
  • అతని స్థానంలో నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ
  • జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఐదో టెస్టు
  • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకబడ్డ‌ టీమిండియాకు పంత్ గాయం గ‌ట్టి దెబ్బ
ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆఖ‌రిదైన ఐదో టెస్ట్‌కు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్ సందర్భంగా కుడి పాదం గాయం కారణంగా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ జట్టుకు దూరమయ్యాడు.

ఈ విష‌యాన్ని ధ్రువీకరించిన బీసీసీఐ జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు అతని స్థానంలో నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేసింది. ఇక‌, పంత్ గాయం ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉన్న టీమిండియాకు గ‌ట్టి దెబ్బ. ఈ సిరీస్ మొత్తం అద్భుతంగా రాణించిన అత‌డు.. మిడిల్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేసి, జ‌ట్టుకు భారీ స్కోర్లు రావ‌డంలో స‌హ‌క‌రించాడు. 

ఎవ‌రీ జ‌గ‌దీశ‌న్‌..?
ఐదో టెస్టుకు పంత్ ప్లేస్‌లో జ‌ట్టులోకి వ‌చ్చిన జ‌గ‌దీశ‌న్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 52 మ్యాచ్‌లు ఆడాడు. 47.5 స‌గ‌టుతో 3,373 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 శ‌త‌కాలు, 14 అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. ఈ నెల 31 నుంచి ఓవ‌ల్‌లో జ‌ర‌గ‌నున్న చివ‌రి టెస్టులో గెలిచి 2-2తో సిరీస్ స‌మం చేయాల‌ని టీమిండియా భావిస్తోంది. మ‌రి కీల‌క మ్యాచ్‌లో జ‌గ‌దీశ‌న్‌ను ఆడిస్తుందా? లేక ధ్రువ్ జురెల్‌కు అవ‌కాశం క‌ల్పిస్తుందా? అనేది చూడాలి. 

ఐదో టెస్టు కోసం అప్‌డేట్ చేయబడిన భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).


More Telugu News